మణుగూరులోని కొమ్ముగూడెం ప్రాంతంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రామసభను నిర్వహించి, స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ప్రాజెక్ట్ విస్తరణ అధికారి కార్తిక్ (ల్యాండ్ ఈక్వేషన్), తహశీల్దార్ నరేష్, సింగరేణి ఓసి ప్రాజెక్ట్ అధికారి ఈ. శ్రీనివాస్, ఎస్వోటి జీఎం శ్రీనివాస చారి ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి, రెవిన్యూ అధికారులు, ప్రభావిత ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.
కొత్త ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ విస్తరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం. భూసేకరణ, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై గ్రామసభలో చర్చలు జరిగాయి.
రైతులు తమ సమస్యలను, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియలో తమకు న్యాయం చేయాలని, ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. అధికారులు తమ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతుందని వారు పేర్కొన్నారు.








